హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్మీడియా విభాగానికి చెందిన ఆరుగురు ప్రతినిధులను సిటీ సైబర్క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే, ఈ అరెస్టుపై సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్షా రిజర్వేషన్లపై మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేశారని బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రేమెందర్రెడ్డి గతనెల 27న ఇచ్చిన ఫిర్యాదుపై సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదే విషయంపై ఢిల్లీలో బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సోషల్మీడియా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు వస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయమే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలో కీలకంగా వ్యవహారిస్తున్న మన్నె సతీశ్, నవీన్, తస్లీమా, గీత, శివ, ఆస్మాలను అదుపులోకి తీసుకున్నారు.
వారిని ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు విచారించి పలు వివరాలు సేకరించారు. అయితే రాత్రి వరకు కూడా ఉన్నతాధికారులు ఎవరూ ఫోన్ లిప్ట్ చేయలేదు, అరెస్టు చేశారా? ఇంకా విచారిస్తున్నారా? నోటీసులు ఇచ్చారా? అనే విషయంపై స్పష్టత కోసం ప్రయత్నించినా అధికారుల నుంచి స్పందన లేదు. అదుపులో తీసుకున్న మాట వాస్తవమని అంతకుముందే అధికారులు నిర్ధారించారు.
ఎందుకీ గోప్యత అంటే?
కేంద్ర హోంమంత్రి వీడియోను మార్ఫింగ్ చేసిన కేసులో దర్యాప్తును ఢిల్లీ సైబర్క్రైమ్ పోలీసులు వేగంగా చేశారు. నోటీసులు జారీ చేయడమే కాకుండా సోషల్మీడియాలో కీలకంగా వ్యవహరించి మార్ఫింగ్ చేసిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిని గుర్తించిన తెలంగాణ పోలీసులు… ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేలా ముందుగానే తమ అదుపులోకి తీసుకున్నట్టు చర్చ జరుగుతున్నది.