మిర్యాలగూడ, జనవరి 30: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి దానిలోని వైర్లు, ఆయిల్ను దొంగలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను మంగళవారం అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వెంకటగిరి తెలిపారు. మంగళవారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. హనుమాన్పేట ఫ్లైఓవర్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి రెండు బైక్లపై వస్తున్న యువకులు పారిపోతుండగా వారిని పట్టుకొని విచారించారు.
నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన కుంచం కోటేశ్, రూ పాని గోపి, రూపాని నాగయ్య, వరికుప్పల శ్రీను, వరుసు నాగరాజు, కుంచం విజయ్ ముఠాగా ఏర్పడి యూట్యూబ్లో ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైర్ తీయడం ఎలా? అని తెలుసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులో ఉన్న కాపర్ వైర్, ఆయిల్ను చోరీ చేసేవారు. మిర్యాలగూడ మండలంలో రెండు, వేములపల్లిలో రెండు, త్రిపురారంలో రెండు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఒకటి మొత్తం ఏడు చోట్ల ట్రాన్స్పార్మర్లను పగులగొట్టి చోరీకి పాల్పడినట్టు డీఎస్పీ తెలిపారు. వీరి నుంచి 305 కిలోల కాపర్ వైర్, మూడు బైక్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని రిమాండ్కు తరలించారు.