Congress | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనమండలికి 2015లో జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు నాటి టీడీపీ నేత, నేటి పీసీసీ అధ్యక్షుడు..రేవంత్రెడ్డి డబ్బులు ఎరవేయడం రాష్ట్రంలో ‘ఓటుకు నోటు’ తొలి కేసుగా నమోదైంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అదే ఎత్తు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణలో ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టేందుకు అవసరమైన నగదును కర్ణాటక నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కర్ణాటక నేతలు ఇక్కడ ఎన్నికలకు అవసరమైన ఖర్చును కూడా అక్కడి నుంచే పంపుతున్నట్టు తెలుస్తున్నది.
బెంగళూరులో ఐటీ అధికారులు గురువారం రాత్రి కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంబికాపతి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు అత్యంత సన్నిహితుడు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న డీకే శివకుమార్ ఆ డబ్బును ఇక్కడికి పంపేందుకే తన సన్నిహితుని వద్ద దాచినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిదేండ్ల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కోటాలో తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు నాటి టీడీపీ నేత రేవంత్రెడ్డి బీఆర్ఎస్కు చెందిన నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్సన్కు కోట్ల రూపాయలు ఎరవేశారు. అందులో భాగంగా రూ. 50 లక్షలను స్టీఫెన్సన్ ఇంటికి తీసుకెళ్లిన రేవంత్రెడ్డి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. నేడు కాంగ్రెస్ పార్టీ సామాన్య ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అదే తరహాలో ప్రయత్నిస్తున్నదని, ఇది ‘ఓటుకు నోటు 2.0’ అవుతుందేమోనంటున్న నెటిజన్ల వ్యాఖ్య సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది.