హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రంజాన్ నెల సమీపిస్తున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో తన అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో పొన్నం మాట్లాడారు. మసీదుల వద్ద శామియానాలు, నీటి వసతి, విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. ఓవర్ లోడ్ పడినప్పుడు ఇబ్బందులు లేకుండా ట్రాన్స్ఫార్మర్లను అదనంగా ఉంచడంతోపాటు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశంచారు. పారిశుద్ధ్య బృందాలను అదనంగా ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు సూచించారు. రంజాన్ మాసం సందర్భంగా షాపులు 24 గంటలు నడుపుకోవడాన్ని పరిశీలించాలని చెప్పారు. పుట్పాత్లపై ఉండే చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలిగించవద్దని తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించద్దని పోలీస్ అధికారులకు సూచించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ స్నేహలత శోభన్రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం, ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, బలాలా, కౌసర్ మొయినుద్దీన్, మహమ్మద్ మజీద్ హుస్సేన్, మీర్ జుల్ఫికర్ అలీ, మహమ్మద్ ముబిన్, ఎమ్మెల్సీలు మీర్జా రహమాత్ బేగ్, మీర్జా రియాజుల్ హాసన్ ఎఫెండీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమర్ జలీల్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.