కరీంనగర్ : జిల్లాలో ఈ నెల 9 న జరుగు వినాయక నిమజ్జనం సజావుగా, సంప్రదాయబద్దంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, నగర మేయర్ వై.సునీల్ రావు, జిల్లా అధికారులతో కలిసి వినాయక నిమజ్జనం ఏర్పాట్ల పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్లో ఏ పండుగ అయినా అన్ని మతాల ప్రజలు కలిసి మెలిసి సోదర భావంతో జరుపుకుంటారని అన్నారు. కరీంనగర్ శాంతి, సామరస్యానికి మారుపేరని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక నిమజ్జనాన్ని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలను కోరారు.
కరీంనగర్ మండపాలలో ఏర్పాటు చేసిన వినాయకులను మానకొండూర్ చెరువు , కొత్తపల్లి చెరువు, చింతకుంట వద్ద కెనాల్లో నిమజ్జనం చేయుటకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం పాయింట్ల వద్ద పకడ్బందీ బార్ కేడింగ్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు.
ఒక్కొక్క పాయింట్ వద్ద రెండు పెద్ద క్రేన్లు, ఒక చిన్న క్రేన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం స్థలాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను (స్విమ్మర్లను) మూడు షిప్టులలో నియమించాలన్నారు.
గణేష్ నిమజ్జనం ప్రదేశాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచాలని, అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారిని మంత్రి ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్, డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ చంద్రమోహన్ ,జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి డా.జువేరియా, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ట్రాన్స్-కో ఎస్ఈ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.