హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): యాసంగి రైతుబంధు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు కోటిన్నర ఎకరాల మేర వ్యవసాయం చేయడానికి 63.25 లక్షల రైతులకు ఈ నెల 28 నుంచి పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు. పది రోజుల పాటు రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నారు. కొత్తగా పాస్బుక్లు పొందిన రైతులు, కొత్తగా ధరణి రికార్డుల్లో నమోదైన రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవటానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) రైతుల నుంచి వివరాలను సేకరించి, ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. వానకాలం సీజన్లో 60.84 లక్షల మంది లబ్ధిదారులుండగా, ఈసారి లబ్ధిదారులు 63.25 లక్షలకు పెరిగే అవకాశాలున్నట్టు అధికారులు పేర్కొన్నారు. యాసంగి సాయం కోసం రూ.7,500 కోట్లు అవసరమవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ యాసంగి సీజన్తో కలిపి మొత్తం 8 విడతలుగా రైతులకు ప్రభుత్వం అందజేసిన రైతుబంధు సాయం రూ.50 వేల కోట్లకు చేరుతున్నది. దేశంలో రైతుల కోసం పెట్టుబడిసాయంగా ఇంత పెద్ద మొత్తం ఖర్చుచేసిన రాష్ట్రం తెలంగాణే.