నల్లగొండ, జనవరి 4 : సబ్సిడీ గొర్రెల యూనిట్ల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపా రు. ఈ నెల రెండో వారంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. నల్లగొండలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికే 7,661 మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.
వారికి రూ.93.63 కోట్లతో ఈ వారం రోజుల్లో గొర్రెల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి ఈ నెలాఖరులోగా ప్రతి ఒక్కరికీ 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందజేస్తామన్నారు. గొర్రెల పంపిణీపై త్వరలో మండల, జిల్లా స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.31లక్షల మంది అర్హులను గుర్తించిన సర్కారు.. ఇప్పటికే 3.96 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేసిందని తెలిపారు.