హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రవాణా శాఖకు మొత్తం రూ.6,285 కోట్ల ఆదాయం రావచ్చని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అంచనా వేశారు. మార్చి 17 నాటికి రూ.6,055 కోట్ల ఆదాయం వచ్చినట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.53 కోట్ల వాహనాల ద్వారా 2021-22లో రవాణా శాఖకు రూ.3,971 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది అదనంగా మరో రూ.2,309 కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.
శనివారం ఆయన ఖైరతాబాద్లోని ప్రాంతీయ కార్యాలయంలో రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రవాణ శాఖ సేవలు, వనరులు, ఆదాయ వృద్ధికి చేపట్టాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పన్నులు కట్టకుండా తిరుగుతున్న వానదారుల నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ద్వారా రూ.63.58 కోట్లు వసూలు చేసినట్టు తెలిపారు. సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కే శ్రీనివాసరాజు, రవాణా శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, సంయుక్త రవాణా కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.