Arogyalakshmi | హైదరాబాద్ : రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతుందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆరోగ్యలక్ష్మి పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈశ్వర్ సమాధానం ఇచ్చారు.
కోటి 93 లక్షల 60 వేల 944 మంది లబ్ధి పొందుతున్నారు అని ఈశ్వర్ తెలిపారు. గర్భిణీ స్త్రీలు 20 లక్షల 67 వేల 55 మంది, పాలిచ్చే తల్లులు 19 లక్షల 26 వేల 388 మంది, 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయసున్న పిల్లలు 97 లక్షల 44 వేల 438 మంది, మూడేండ్ల నుంచి 6 సంవత్సరాల పిల్లలు 54 లక్షల 59 వేల 211 మంది, తక్కువ బరువు గల పిల్లలు ఒక లక్షా 77 వేల 852 మంది ఈ పథకం కింద పోషకాహారం పొందుతున్నారు. జనవరి 2015 నుంచి జూన్ 30, 2023 వరకు 16 వందల 33 కోట్ల 26 లక్షలు ఖర్చు చేయడం జరిగింది అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య లక్ష్మి గొప్పగా అమలవుతోందన్నారు మంత్రి. మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. గర్భిణిలు, పిల్లలకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మెడిసిన్స్ అందించి, రక్తహీనతను నివారిస్తున్నాం. అంగన్వాడీల ద్వారా ఈ పథకం అమలు చేస్తున్నాం అని కొప్పుల ఈశ్వర్ తెలిపారు.