హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): మహిళ ఆరోగ్యం-ఇంటి సౌభాగ్యం.. అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం కీలక మైలురాయిని అందుకున్నది. మంగళవారం ఉమెన్ స్పెషల్ క్లినిక్స్లో ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య లక్ష దాటింది. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మంగళవారం 100 ‘ఉమెన్ స్పెషల్ క్లినిక్స్’లో మహిళల 8 ప్రధాన ఆరోగ్య సమస్యలకు పరీక్షలు చేసి, చికిత్సలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 1,02,463 మంది పరీక్షలు చేయించుకోగా, అనుమానిత లక్షణాలు గుర్తించిన 7,177 మందిని పైదవాఖానలకు రెఫర్ చేశారు.