హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మహిళ ఆరోగ్యం- ఇంటి సౌభాగ్యం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి స్పందన క్రమంగా పెరుగుతున్నది. నాలుగో మంగళవారం రికార్డుస్థాయిలో 9,806 మంది మహిళలు తరలివచ్చి వైద్య సేవలు పొందారు. గత మంగళవారం 7,965 మంది రాగా.. ఈసారి సుమారు 2 వేల మంది అదనంగా పరీక్షలు చేయించుకొన్నారు.
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. ప్రతి మంగళవారం మహిళలకు మాత్రమే వైద్య పరీక్షలు జరిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా 100 ‘ఉమెన్ స్పెషల్ క్లినిక్స్’ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న వైద్యారోగ్య శాఖ మ్రంతి హరీశ్రావు కరీంనగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. 14వ తేదీ నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. మహిళలు ఎదురొంటున్న 8 ప్రధాన ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నారు.