అక్టోబర్ 15 నుంచి నవంబర్ 23 వరకు
ఫలించిన మంత్రి జగదీశ్రెడ్డి కృషి
సూర్యాపేట, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకొనే యువత కోసం నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ఈసారి సూర్యాపేటలో జరుగనున్నది. మంత్రి జగదీశ్రెడ్డి ఆర్మీ అధికారులతో మాట్లాడి సూర్యాపేటలో నిర్వహించేలా చొరవ తీసుకొన్నారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 23 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు డిఫెన్స్ విభాగం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు రానున్నారు.
ఆర్మీలో జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఏవియేషన్ అండ్ అమ్యునీషన్, స్టోర్ కీపర్ వంటి ఆరు విభాగాల్లో ఎంపిక కోసం 17.5 ఏండ్ల నుంచి 23 ఏండ్లలోపు వయసున్న వారు అర్హులుగా నిర్ణయించారు. సూర్యాపేటకు చెందిన కర్నల్ సంతోష్బాబు మృతిచెందిన సందర్భంలో ఆర్మీ ఉన్నతాధికారులు సూర్యాపేటకు వచ్చారు. సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టాలని మంత్రి జగదీశ్రెడ్డి ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కర్నల్ మనోజ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన ఉన్నతాధికారులు సూర్యాపేటకు చెందిన ది సోల్జర్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీనివాస్రావు నేతృత్వంలో ఆరు నెలల క్రితం ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,962 మంది యువతీ యువకులు ఈ ర్యాలీలో పాల్గొనగా అందులో 274 మంది ఎంపికైన విషయం తెల్సిందే. ఆర్మీ అధికారులతో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడిన ఫలితంగా ఆర్మీ రిక్రూట్మెంట్ను ఈసారి సూర్యాపేటలో నిర్వహించనున్నట్టు డిఫెన్స్ అధికారులు తెలిపారు.