హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాటాచౌర్యం కేసులో ఆర్మీ అధికారులు రంగంలోకి దిగారు. ఆర్మీ డాటా కూడా చోరీకి గురైనట్టు తేలడంతో సైబరాబాద్ పోలీసులను శుక్రవారం సంప్రదించి, కేసు సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ఆర్మీ అధికారులు కోరినట్టు తెలిసింది. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ఆర్మీ డాటా ఎలా బయటకు వచ్చింది? ఆర్మీ వెబ్సైట్లను నిందితులు హ్యాక్ చేశారా? లేక ఎవరి సహకారంతోనైనా దొంగిలించారా? అనే అంశాలను సిట్ ఆరా తీస్తున్నది. ఆర్మీ సైతం సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో సిట్కు సమాంతరంగా అంతర్గత విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.
ఆర్మీ డాటాను నిందితులు విదేశాలకు, శత్రుదేశాలకు ఏమైనా చేరవేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 17 కోట్ల మంది డాటాను వివిధ మార్గాల ద్వారా సేకరించి, దానిని నోయిడా కేంద్రంగా విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులను కోర్టు అనుమతితో ఐదు రోజులపాటు కస్టడీకి తీసుకొన్న సిట్.. నాలుగు రోజులుగా ప్రశ్నిస్తున్నది. ఈ విచారణలో భాగంగా సిట్లోని ఒక బృందం మరోసారి నోయిడాకు వెళ్లి, అక్కడ నిందితులకు సంబంధించిన అనుచరులు, సన్నిహితుల వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. శుక్రవారం జరిపిన విచారణలో అత్యంత కీలక అంశాలను నిందితులు వెల్లడించినట్టు సమాచారం. తాజా సమాచారంతో అధికారులు డాటా లీక్కు పాల్పడిన వారిని విచారించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది.
నేటితో ముగియనున్న కస్టడీ
నిందితుల కస్టడీ శనివారంతో ముగియనుండటంతో మరోసారి నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ సన్నాహాలు చేస్తున్నది. దేశవ్యాప్తంగా బ్యాంకులు, వివిధ కాల్సెంటర్ల నుంచి అక్కడ పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా డాటాను నిందితులు సేకరించినట్టు తెలిసింది. ఆయా ఔట్సోర్సింగ్ యూనిట్ల నిర్వహణ సంస్థలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు నిందితుల నుంచి సేకరించిన అంశాలతో సిట్ నివేదికను సిద్ధంచేసినట్టు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సమాచారం ఇవ్వడంతోపాటు ఈ కేసుకు కావాల్సిన మరింత సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. దేశ భద్రత, ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్న డాటా చోరీ కేసుపై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సైతం దృష్టిసారించింది. ఈడీ అధికారులు సైబరాబాద్ పోలీసుల నుంచి సమాచారం సేకరించి, కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సిట్ కస్టడీలో ఉన్న నిందితుల విచారణ పూర్తికాగానే, కోర్టు అనుమతితో ఈడీ సైతం నిందితులను తమ కస్టడీకి తీసుకొని విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.