దుబ్బాక, సెప్టెంబర్ 26: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. సభావేదికపై పాటించాల్సిన ప్రొటోకాల్ అంశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రొటోకాల్ను పాటించకుండా కాంగ్రెస్ నాయకులు కొందరు సభావేదికపైకి రావడంతో గొడవ తలెత్తింది. దుబ్బాకలోని రజినీకాంత్రెడ్డి ఫంక్షన్హాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మెదక్ ఎంపీ రఘునందన్రావు హాజరయ్యారు.
మంత్రి సురేఖకు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్రావు మంత్రిని దుబ్బాక చేనేతల నూలు దండతో సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డిని సభావేదికపైకి ఆహ్వానించడంతో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. దీంతో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించాలని, ఇది పార్టీ కార్యక్రమం కాదని అధికారులకు సూచించారు. సభా వేదికపై నుంచి కాంగ్రెస్ నాయకుడు చెరుకు శ్రీనివాస్రెడ్డి వెళ్లకపోతే బీఆర్ఎస్ నాయకులు సైతం వేదికపైకి వస్తారని అధికారులకు చెప్పారు. దీంతో వేదికపైనే ఉన్న కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్రెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితో వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు హోరాహోరీగా నినాదాలు చేశారు. సభా ప్రాంగణం వద్ద తోపులాట జరిగింది. మరోపక్క ఉన్న బీజేపీ శ్రేణులు నినాదాలు చేయడంతో కల్యాణలక్ష్మి కార్యక్రమం రసాభాసగా మారింది. ఉద్రిక్తత పరిస్థితుల మధ్యే మంత్రి సురేఖ ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. నాయకుల నినాదాలు, తోపులాటతో కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులు ఒకింత భయాందోళనకు గురయ్యారు.