హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు డోకూరి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పదేండ్లుగా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు పది రోజుల ముందు వరకూ అభ్యర్థులను వెతుక్కోవడం సిగ్గుచేటని విమర్శించారు.
డబ్బులిచ్చిన వారికే టికెట్లు ఇచ్చిన వారు ప్రతిపక్షమని చెప్పుకోవడానికి సిగ్గు పడాలని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు, తాగునీరు, సాగునీరు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై దేనికైనా చర్చకు సిద్ధమేని చెప్పారు. ఇంటి విషయాలు, విదేశీ వ్యవహారాలు తెలియని కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి అప్పులు, ఆదాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. చిదంబరం, నిర్మలా సీతారామన్, డీకే శివకుమార్ వంటి వారు కూడా ఎన్నికల వేళ కారుకూతలు కూస్తున్నారని, ఉద్యోగాల కల్పన, 24 గంటల కరెంటు, తలసరి ఆదాయం, అప్పుల్లో తెలంగాణ స్థానంపై తమతో చర్చించే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు.
ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ అధికారాన్ని ప్రశ్నించే నాయకులు.. ఏ అధికార దాహంతో తెలంగాణకు వచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే తెలంగాణ అత్యధికంగా ఉద్యోగాలు కల్పించిందని, రైతులను ఆదుకున్నదని, వందలాది సంక్షేమ పథకాలు పేదల కోసం అమలు చేస్తున్నదని చెప్పారు. ‘అప్పుడెట్లుండె తెలంగాణ.. ఇప్పుడెట్లున్నది తెలంగాణ. మీకు ధైర్యం ఉంటే చర్చకు సిద్ధం కావాలి’ అని పొన్నాల సవాల్ విసిరారు.