హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగానికి ఐటీని అనుసంధానించడంలో తెలంగాణ గొప్ప ప్రయత్నం చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ యోగితారాణా ప్రశంసించారు. ఈ ఏడాది వానకాలం సీజన్ సన్నద్ధతపై గురువారం హైదరాబాద్లో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు రాష్ట్రంలో వానకాలం సన్నద్ధత, సాగు విస్తీర్ణం, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల లభ్యతను వివరించారు. అనంతరం యోగితారాణా మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో తెలంగాణ అనేక మైలురాళ్లు సాధించిందని కొనియాడారు. ముఖ్యంగా క్రాప్ బ్యాంకింగ్, క్రాప్ డాటా మేనేజ్మెంట్, క్రాప్ హెల్త్ స్టేటస్ తెలుసుకోవడం, ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల నిర్వహణకు ఆన్లైన్ లైసెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటివి ప్రవేశపెట్టడం బాగున్నదని ప్రశంసించారు.
అందువల్లే రాష్ట్రంలో విత్తనాలు అవసరానికి మించి నిల్వ ఉన్నాయని చెప్పారు. వీటిని ఇతర రాష్ర్టాలకు సరఫరా చేయడంపై ఆలోచించాలని కోరారు. రఘునందన్ రావు మాట్లాడుతూ.. 2014-15లో రాష్ట్రంలో 1.29 కోట్ల ఎకరాల్లో సాగుకాగా, 2022-23 నాటికి 2.32 కోట్లకు పెరిగిందని వివరించారు. వానకాలం వరి విస్తీర్ణం 22.74 లక్షల ఎకరాల నుంచి 64.99 లక్షల ఎకరాలకు పెరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలో 950 ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. పస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈ ఏడాది జూలై 12 నాటికి రాష్ట్రంలో 42.76 లక్షల ఎకరాల్లో సాగైందని వెల్లడించారు.