హైదరాబాద్ : తెలంగాణలోని గ్రామాల అభివృద్ధి దేశ వ్యాప్తంగా అందరి మన్ననలు అందుకుంటున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇక్కడ అమలు అవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రత్యేకించి పల్లె ప్రగతి కార్యక్రమం అందరిని ఆకట్టుకుంటున్నదని ఆయన తెలిపారు.
కాగా, ఈ నెల 22, 23 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం చండీగఢ్లో నిర్వహించిన జాతీయ సెమినార్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలంగాణ అభివృద్ధిని సెమినార్లో వివరించారు.
దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన మిగతా రాష్ట్రాల స్థానిక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలంగాణ పల్లెల అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారని.. దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ లింగన్న గౌడ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసి వివరించారు.
ఈ మేరకు మంత్రి సర్పంచ్, సెమినార్లో పాల్గొన్న ఇతర ప్రజాప్రతినిధులను అభినందించారు. ఈ ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు.