Guest Lecturers | మెదక్, మే 27 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులకు (అతిథి అధ్యాపకులుగా) దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ సువర్ణలత ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్, తూప్రాన్, రామాయంపేట, కొల్చారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలికలు)లో తెలుగు, హిందీ, ఆంగ్లం, పీఈటీ, పీడీ, సివిక్స్, కామర్స్, భౌతిక, రసాయన, జువాలజీ, జీవశాస్త్రం, గణితం తదితర సబ్జెక్టుల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ల పోస్టులు (మహిళలకు) ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయ, అధ్యాపకుల ఖాళీల్లో పార్ట్టైం ప్రతిపాదికన పని చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ కలిగి ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలని పేరొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. అభ్యర్థులను మెరిట్, డెమో ఆధారంగా ఎంపిక చేస్తారని, డెమోలు ఈ నెల 31న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని సూచించారు.