ఓ కుటుంబానికి 12 ఏండ్ల కిందట రేషన్కార్డు మంజూరైంది. భార్య, భర్త, ముగ్గురు పిల్లలు మొత్తం ఐదుగురు లబ్ధిదారులుగా ఉన్నారు. కొన్నేండ్లకు ముగ్గురు పిల్లలకు పెండ్లిళ్లయ్యాయి. కూతురు అత్తవారింటికి వెళ్లిపోగా, కొడుకులిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. వారికి కూడా సంతానం కలిగింది. ఆ కుటుంబానికి ఒకే యూనిట్గా రేషన్కార్డు ఉన్నా.. ఇప్పుడు మూడు కుటుంబాలుగా మారిపోయింది. కొడుకులు భార్యాపిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సొంతంగా కొత్తకార్డు కోసం వారు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
ఇప్పుడు ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకొంటున్నట్టు ప్రకటించింది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోయే ‘ప్రజాపాలన’లో గ్యారెంటీలకు దరఖాస్తులు తీసుకోనున్నట్టు తెలిపింది. మరి పైన పేర్కొన్న కుటుంబం ఏ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవాలి? ఒకే కుటుంబంగానా? మూడు కుటుంబాలుగానా?
White Ration Card | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలను, సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదివారం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆదేశాలు జారీచేశారు. అన్ని పథకాలకు రేషన్కార్డే ప్రామాణికమని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ‘రేషన్కార్డు లేనివారి సంగతి ఎలా?’ అనే ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతున్నది. వాస్తవానికి రాష్ట్రంలో చాలా కాలంగా కొత్త రేషన్కార్డుల మంజూరు కాలేదు. ఉన్న కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పు, తొలగింపు వంటి ప్రక్రియ కూడా జరుగలేదు. దీంతో పాత వివరాలే ఇప్పటికీ నడుస్తున్నాయి.
ఆ తర్వాత అనేక కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలు, అన్నదమ్ములు వేర్వేరుగా ఉంటున్నా.. ఇప్పటికీ వారందరికీ ఒకే రేషన్కార్డు ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆయా కార్డుల్లో వాళ్ల భార్యా పిల్లల పేర్లు కూడా ఎక్కని పరిస్థితి. వాస్తవానికి వారు ప్రత్యేకంగా కుటుంబంగా ఏర్పడ్డారు కాబట్టి.. ప్రభుత్వం అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకొనేందుకు వారు అర్హులు. కానీ రేషన్కార్డు లేకపోవడం వల్ల వారు కొత్తగా దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని కోల్పోనున్నారు. మరోవైపు రాష్ట్రంలో సుమారు 10 లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకా దరఖాస్తు చేయనివారు 2 లక్షల మందిగా అంచనా వేసుకొంటే.. సుమారు 12 లక్షల కుటుంబాలు ఉంటాయి. వీరంతా ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకోవచ్చా? లేదా? అనేది ఇప్పటివరకు అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు అధికారులనుంచి గానీ స్పష్టత రావడంలేదు. ఒకవేళ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకొంటే వాటిని పరిగణనలోకి తీసుకొంటారా? లేదా? అనే విషయంలోనూ గందరగోళం నెలకొన్నది.
కార్డుల్లో మార్పులు.. మరి కొత్తవి ఎప్పుడు?
ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో సుమారు 80 శాతానికిపైగా మందికి రేషన్ కార్డులు ఉన్నాయని, వాటిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉన్నదని ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం పేర్కొన్నది. కార్డుదారుల్లో బియ్యం తీసుకుంటున్నవారి సంఖ్య 80 శాతం మాత్రమే ఉన్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేషన్కార్డుల క్రమబద్ధీకరణ జరుగుతుందని ప్రచారం మొదలైంది. ఒకవేళ అదే నిజమైతే ముందుగా కార్డులను క్రమబద్ధీకరిస్తారా? లేదా ప్రజాపాలనలో దరఖాస్తులకు పథకాలు మంజూరు చేస్తారా? అనే విషయంలోనూ ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఒకవేళ క్రమబద్ధీకరించకుండా పథకాలు మంజూరు చేస్తే మళ్లీ కొంతమేర అనర్హులకే దక్కినట్టు అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు.. పెండింగ్లో ఉన్న 10 లక్షల దరఖాస్తులను పరిశీలించి, కొత్త కార్డులు మంజూరు చేస్తారని కొందరు చెప్తుండగా, మరికొందరు కొత్తగా దరఖాస్తు ప్రక్రియ చేపడతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే దరఖాస్తులను ఎప్పటిలోగా పరిశీలించి, కొత్తకార్డులు ఇస్తారనేదానిపైనా స్పష్టత కరువైంది. కొత్తగా రేషన్కార్డు ఇచ్చిన తర్వాతే మళ్లీ ఆరు గ్యారెంటీలకు అర్హులవుతారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.