హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : 52 సంవత్సరాల చరిత్ర గల సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ను కాపాడాలని వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. గురువారం సచివాలయంలో సెస్ చైర్మన్ చికాల రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతితో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెస్ గురించి మంత్రికి వివరించారు. 2,97,708 సభ్యులతో 2,55,830 కనెక్షన్లతో, సభ్యుల వాటా ధనం రూ. 6,14,81,587తో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ సేవలందిస్తున్నదని తెలిపారు.
సెస్కు సుమారు రూ. 500 కోట్ల ప్రభుత్వ బకాయిలు ఉన్నాయని, అప్పుల్లో ఉన్నదనే వాదన సత్యదూరమని చెప్పారు. ఫిబ్రవరి నెలలో సెస్ను మూసివేయాలని లేక ఎన్డీపీసీఎల్లో విలీనం చేయాలని ఈఆర్సీ ప్రభుత్వానికి నివేదించిందని, విలీన నిర్ణయాన్ని విరమించుకొని సెస్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి నివేదికలు, వివిధ సంస్థలతో చర్చలు జరిపి తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.