హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రకంపనలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. పలు నియోజకవర్గాల నుంచి మహా నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ముంబయి కుర్లా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్సీపీ పార్టీ నుంచి పోటీచేసిన అప్పాసాహెబ్ ఆనందరావు అవ్చారే బీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ పట్టున్న ఆయన చేరిక ప్రాధాన్యం సంతరించుకున్నది. సోమవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో అవ్చారే పార్టీలో చేరారు. అవ్చారేకి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తొమ్మిదేండ్ల అనతికాలంలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయటం తనకెంతో సంతోషంగా ఉన్నదని అప్పాసాహెబ్ తెలిపారు. తెలంగాణలో సాధించిన అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు? అందుకోసం తాము కేసీఆర్ నాయకత్వంలో పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పాల్గొన్నారు.
ప్రజల మనిషి అవ్చారే
సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ మహారాష్ట్రలో ప్రజాభినాన్ని పొందిన నాయకుడిగా అప్పాసాహెబ్ పేరుగాంచారు. ముం బాయిలోని చెంబూర్లో ప్రజాగ్రంథాలయా న్ని స్థాపించి ఆయన విద్యార్థులకు పోటీపరీక్షల్లో సాయపడుతూ, ప్రజలకు చదువు నేర్పించటానికి తోడ్పాటునందిస్తున్నారు. విద్యాభ్యాసాన్ని పెంపొందించే దిశగా ఆయన చేపట్టిన చర్యలకు, చేసిన సేవలకు మహారాష్ట్ర ప్రభు త్వం ఏ గ్రేడ్ గ్రంథాలయంగా గుర్తించింది. ఈ గ్రంథాలయంలో 24 లక్షల రూపాయల విలువ చేసే 21 వేల పైచిలుకు గ్రంథాలను అందుబాటులో ఉంచటం ద్వారా విద్యారంగానికి సేవ చేస్తున్నారు.