విద్యానగర్, జూలై 5: గుండె జబ్బులకు మెరుగైన వైద్యం అందించడంలో ఉత్తర తెలంగాణలోనే పేరొందిన కరీంనగర్లోని అపోలో రీచ్ హాస్పిటల్ మరో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఒకేసారి గుండె, మెదడు శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన కాశెట్టి శ్రీనివాస్, అంజలి దంపతుల పెద్ద కుమార్తె సాయిశ్రీ (14) తొమ్మిదో తరగతి చదువుతున్నది. గత నెల 28న సాయిశ్రీ పాఠశాలలో తీవ్ర అస్వస్థతకు గురైంది. మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి కుడికాలు, కుడి చెయ్యి చచ్చిపడిపోయి, మాట కూడా రాని పరిస్థితికి చేరింది. వెంటనే నగరంలోని అపోలో రీచ్ హాస్పిటల్లో చేర్పించారు.
నరాల వైద్య నిపుణుడు డాక్టర్ సంజయ్ కుమార్ కామిన్వార్, గుండె వైద్య శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ అనిల్ కుమార్ ముల్పూర్ పర్యవేక్షణలో పాప మెదడులోని రక్తం గడ్డలను అధునాతన సాంకేతికతతో సెరబ్రల్ ఆంజియోగ్రఫీ, మెకానికల్ త్రంబెక్టమీ అనే ప్రత్యేక పద్ధతి ద్వారా శస్త్ర చికిత్స నిర్వహించి రక్తం గడ్డల అడ్డంకులను తొలగించారు. పాపకు గుండె లోపల ఎల్ఏ మిక్జోమా అనే అరుదైన కణతి ఉన్నట్టు గుర్తించి శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆ తరువాత పూర్తిగా కోలుకొని తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నది. విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించిన వైద్య బృందాన్ని ఈ సందర్భంగా దవాఖాన కార్యనిర్వహణాధికారి డాక్టర్ నాగ సతీశ్ అభినందించారు.