Andhra Pradesh | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఏప్రిల్లో ఏపీ తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్ నుంచి 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కుడికాలువ నిర్వహణ కోసం డ్యామ్పైకి ఏపీ అధికారులను అనుమతించేలా సీఆర్పీఎఫ్ అధికారులకు ఆదేశాలివ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తాజాగా ఓ లేఖ రాసింది.
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల అంశంపై చర్చించేందుకు గత అక్టోబర్లో సమావేశమైన త్రిసభ్య కమిటీ.. అప్పటికి అందుబాటులో ఉన్న జలాల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రం ఇప్పటికే శ్రీశైలం నుంచి 26.571, సాగర్ నుంచి 15.383 టీఎంసీలు కలిపి మొత్తం 41.954 టీఎంసీలను వినియోగించుకున్నది. సాగర్ కుడికాలువ ద్వారా ఇంకా 5 టీఎంసీలు ఇవ్వాలని తాజా లేఖలో ఏపీ కోరింది.