ఖమ్మం, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అది భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్.. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట అవుతున్నది.. 85 ఏండ్ల ముసలాయన ఊతకర్ర పట్టుకొని, వణక్కుంటూ మెల్లగా నడుచుకుంటూ మీసేవ దగ్గరికి వచ్చాడు.. ‘అయ్యా! నాకు రేషన్ కార్డు కావాలి. దరఖాస్తు చేయటానికి వచ్చా’ అని బొంగురుపోయిన అమాయక గొంతుతో మీసేవ నిర్వాహకుడికి చెప్పాడు. అడ్రస్ అడిగితే ఆంధ్రప్రదేశ్లోని అల్లిగూడెమని వివరించాడు. ఏపీ వాళ్లకు తెలంగాణలో రేషన్ కార్డు ఇవ్వటం సాధ్యం కాదని మీసేవ నిర్వాహకుడు వివరించాడు. అయ్యో! అవునా.. అనుకొన్న ఆ వృద్ధుడు మెల్లగా బయటికి బయలుదేరాడు. అక్కడే తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు
ఫొటో కనిపించే సరికి.. రెండు చేతులెత్తి దండం పెడుతూ, ప్రజల దేవుడు కేసీఆర్ అని కొనియాడాడు. వివరాల్లోకెళితే.. భద్రాచలం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం అల్లిగూడేనికి చెందిన అంజయ్య.. భద్రాచలంలోని మీసేవకు వచ్చి రేషన్ కార్డు అడిగాడు. తనకు గతంలో ఇచ్చిన రేషన్కార్డు పోగొట్టుకొన్నానని, దీంతో రేషన్ అందడం లేదని చెప్పాడు. గతంలో కుక్కునూరు మండలం తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో విలీనమైంది. తనకు తెలంగాణలోనే రేషన్ కార్డు ఇప్పించి ఆదుకోవాలని ఆ వృద్ధుడు వేడుకొన్నాడు. ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండేవారికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు ఇవ్వడం సాధ్యం కాదని మీసేవ నిర్వాహకుడు వృద్ధుడికి సమాధానం ఇచ్చాడు. దీంతో విషయం అర్థమైన వృద్ధుడు నిరాశ చెందాడు. మీసేవ కేంద్రంలోనే సీఎం కేసీఆర్ చిత్రపటం కనిపించేసరికి.. రెండు చేతులు జోడించి సమస్కరించాడు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉన్నదని కొనియాడాడు. ఆసరా పెన్షన్, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని చెప్పాడు. ‘సంక్షేమ పథకాలంటే తెలంగాణలో లెక్క ఉండాలి. పథకాలంటే ప్రజలకు మేలు చేసేలా ఉండాలి. కేసీఆర్ అలాంటి పథకాలే అమలు చేస్తున్నారు. ఇక్కడి పథకాలు అద్భుతం. అందుకే ప్రజల పాలిట కేసీఆర్ దేవుడయ్యారు’ అని శ్లాఘించాడు. తాను మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి అభిమానినని, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే అభిమానమని తన మనసులోని మాటను చెప్పాడు. ఆ ముసలాయన మాటలతో చలించిపోయిన మీసేవ నిర్వాహకుడు.. భోజనం పెట్టి, తిరుగుప్రయాణానికి రవాణా ఖర్చులు ఇచ్చి పంపించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది.
ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానం
భద్రాచలంలోని చేతన మీసేవా సెంటర్ యజమాని రంజిత్ నాయక్ ఘటనను ఇలా వివరించాడు. ‘శుక్రవారం మధ్యాహ్నం వంటశాల అంజయ్య (85) మీసేవా సెంటర్కు వచ్చాడు. చిరునామా ఉన్న చిన్న కాగితం నాకు ఇచ్చాడు. తన గ్రామం ఆంధ్రప్రదేశ్లోని కుక్కునూరు మండలం అల్లిగూడెమని తెలిపాడు. తెలంగాణ నుంచి రేషన్ కార్డు సాధించాలన్న ఆరాటం చూసి చలించిపోయా. అవకాశం లేదని వివరించడంతో సమస్యను అర్థం చేసుకొన్నాడు. మీసేవ సెంటర్లోని సీఎం కేసీఆర్ చిత్రపటానికి రెండు చేతులు జోడిస్తుంటే ఒళ్లు గగుర్పొడిచింది’ అని రంజిత్నాయక్ తెలిపాడు.