KCR | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఏపీ విద్యార్థి, యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ పేర్కొన్నారు. ఏపీ నేతల స్వార్థ, అసమర్థ రాజకీయాలతో అక్కడి ప్రజల బతుకులు దుర్భరంగా మారాయని విమర్శించారు. ఏపీ విద్యార్థి జేఏసీ నాయకుల బృందం శుక్రవారం హైదరాబాద్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతోపాటు సచివాలయాన్ని సందర్శించింది.
ఈ సందర్భంగా రాయపాటి జగదీశ్ మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లలో తెలంగాణను సీఎం కేసీఆర్ దేశానికే రోల్మాడల్గా తీర్చిదిద్దారని కీర్తించారు. ఏపీకి జరగుతున్న అన్యాయాలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్కల్యాణ్కు లేదని మండిపడ్డారు. తెలంగాణ తరహా సంక్షేమ, అభివృద్ధి పథకాలు తమకూ కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని, కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఏపీలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఏపీలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమని, బీఆర్ఎస్ను గెలిపించుకోవడం ద్వారానే ప్రత్యేక హోదా సాధించుకోవచ్చునని అన్నారు. కార్యక్రమంలో దళిత జాగృతి ఏపీ అధ్యక్షుడు కొమ్ము రాజీవ్, విద్యార్థి జేఏసీ నాయకులు మార్క్, నంబూరి రాజేశ్, రవితేజ, దేవా తదితరులు పాల్గొన్నారు.