హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో గుండెపోటు
అపోలో దవాఖానకు తరలింపు.. గంటలోనే కబళించిన మృత్యువు
మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్, పలువురు ప్రముఖుల నివాళి
రేపు ఏపీలో అంత్యక్రియలు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 : ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం తీవ్రమైన గుండెపోటుతో హైదరాబాద్లోని తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దుబాయ్ ఎక్స్పోలో వారంరోజులపాటు పాల్గొన్న ఆయన ఆదివారమే హైదరాబాద్ చేరుకొన్నారు. రాత్రి ఒక వివాహ వేడుకలో పాల్గొని 9.45 గంటల కల్లా ఇంటికి తిరిగొచ్చారు. సోమవారం ఉదయం 6 గంటలకు నిద్ర లేచి, కాసేపు ఇతరులతో ముచ్చటించారు. 7.20 గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి పుడుతున్నదని కూర్చున్న సోఫాలోనే వాలిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. సోఫాలో కూలబడ్డ ఆయన కనీసం మంచినీళ్లు కూడా తాగలేకపోయారు. డ్రైవర్ నాగేశ్వరరావు కొద్దిసేపు ఛాతీ ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన గౌతమ్రెడ్డి సతీమణి శ్రీకీర్తి వెంటనే అపోలో దవాఖానకు తరలించారు. ఉదయం 7.45 గంటలకు అపోలోకు చేరుకోగా దాదాపు 90 నిమిషాలపాటు వైద్యులు ఐసీయూలో ఉంచి వైద్యసేవలు అందించినప్పటికీ ఫలి తం దక్కలేదు. గౌతమ్రెడ్డి ఉదయం 9.13 గంటకు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. జిమ్లో వ్యాయామం చేస్తుండగా మృతిచెందినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కుటుంబసభ్యులు వివరించారు. బంధువులు, అభిమానుల సందర్శనార్థం గౌతమ్రెడ్డి భౌతికాయాన్ని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి తరలించారు. మంగళవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్లో నెల్లూరుకు తరలించనున్నారు. అమెరికాలో ఉంటున్న ఆయన కుమారుడు అర్జున్రెడ్డి వచ్చిన తరువాత బుధవారం రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి కుమారుడైన గౌతమ్రెడ్డి 1971 నవంబర్ 2న జన్మించారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు ఎన్నికయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాబినెట్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అజాత శత్రువు, వివాదరహితుడు, సంస్కారవంతుడు అనే మంచిపేరు తెచ్చుకొన్నారు. గౌతమ్రెడ్డికి భార్య శ్రీకీర్తి, కుమార్తె అనన్యరెడ్డి, కొడు కు అర్జున్రెడ్డి ఉన్నారు. గత నెల 22న కొవిడ్ బారినపడి కోలుకున్న గౌతమ్రెడ్డి చిన్నవయసులోనే హఠాన్మరణం చెందడం పలువురిని కలచివేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల నివాళి
గౌతమ్రెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. జూబ్లీహిల్స్లోని గౌతమ్రెడ్డి నివాసంలో ఉన్న పార్థివదేహానికి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు గౌతమ్రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి, నివాళి అర్పించారు. మేకపాటి రాజమోహన్రెడ్డిని, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. గౌతమ్రెడ్డి మరణవార్త విని షాకయ్యాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.