Burgampahad |హైదరాబాద్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపు ప్రభావం ఉంటుందని ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఏండ్లుగా తెలంగాణ సర్కారు పట్టువిడవకుండా చేస్తున్న కృషి ఫలించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ముంపు ప్రభావం ఏమీ ఉండబోదంటూ 2014 నుంచి కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్న ఏపీ సర్కారు దిగిరాక తప్పలేదు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ ఎఫెక్ట్తో బూర్గంపాడు ముంపునకు గురవుతుందని ఆది నుంచీ తెలంగాణ చేస్తున్న వాదనలు వాస్తవమేనని ఏపీ ఒప్పుకున్నది. ఈ మేరకు తెలంగాణ సర్కారుకు ఏపీ లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం బ్యాక్వాటర్ ఎఫెక్ట్ సమస్యపై ప్రభావిత రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలతో కేంద్ర జలసంఘం వరుసగా సమావేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఏపీకి, పోలవరం ప్రాజెక్టుఅథారిటీకి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఏప్రిల్ 10లోగా తెలంగాణ, ఏపీ ఇరురాష్ర్టాలతో సమావేశం నిర్వహించాలని అల్టిమేటం జారీ చేసింది. ముంపుపై ఇరు రాష్ర్టాలు గతం లో చేసిన అధ్యయనాలపై, రూపొందించిన మ్యాపులపై చర్చించాలని దిశానిర్దేశం చేసింది. తదననంతరం ఉమ్మడి సర్వేను సత్వరమే చేపట్టాలని నొక్కిచెప్పింది. అయినప్పటికీ పీపీఏ ఇప్పటికీ వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో పీపీఏ ఉదాసీన వైఖరిని తెలంగాణ తీవ్రంగా ఆక్షేపిస్తూ ఇటీవలే మరోసారి ఘాటు లేఖ రాసింది. దీనిపై ఏపీ వెంటనే స్పందించడం గమనార్హం. తాజాగా పోలవరం ప్రాజెక్టు వల్ల బూర్గంపాడు ముంపునకు గురవుతుందని ఏపీ స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణకు సమాచారం ఇవ్వటంతోపాటు, దాని టోపో షీట్లు తదితర డాటాను పంపింది.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ వల్ల భద్రాచలంతోపాటు, అంచనాకు మించి గ్రామాలకు ముంపు ప్రమాదం ముమ్మాటికీ పొంచి ఉన్నదని రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ సర్కారు బలంగా వాదిస్తున్నది. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనంతో పాటు, నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నది. అయినా ఏపీ, పీపీఏలు తెలంగాణ వాదనలు ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వస్తున్నాయి. ఇక సీడబ్ల్యూసీ సైతం వాదనలకు సంబంధించి నిర్దిష్ట ఆధారాలు కావాలంటూ దాటవేత ధోరణిని అవలంబిస్తూ వచ్చింది. దీంతో తెలంగాణ, ఇంజినీర్లు ముమ్మర కసరత్తు చేశారు. గోదావరి వరద ప్రవాహాల తీరును, గతంలో వచ్చిన వరదలను, ఈ ఏడాది వచ్చిన వరద లెక్కలను సరిపోల్చుతూ, ముంపు ప్రాంతాలను, అం దుకు గల కారణాలను పూర్తిస్థాయిలో అంచ నా వేశారు.
అదీగాక శాటిలైట్ చిత్రాలనూ సేకరించారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా తీయించారు. పోలవరం ముంపు ప్రభావంపై గతంలో ఏపీ, ఇతర కేంద్ర సంస్థలు చేసిన అధ్యయనాలను కూలంకషంగా అధ్యయనం చేసి లోపాలను వెలికితీశారు. ఏపీ, సీడబ్ల్యూసీకి మధ్య జరిగిన కీలక పత్రాలను వెలుగులోకి తెచ్చారు. ప్రాజెక్టు ముంపు అంశాలన్నింటికీ సంబంధించిన ఆధారాలన్నింటినీ క్రోడీకరించి దాదాపు 45 పేజీల ప్రజంటేషన్ను సిద్ధం చేసి సీడబ్ల్యూసీకి అందజేశారు. దీంతో దిగొచ్చిన సీడబ్ల్యూసీ తెలంగాణ వాదనలను అంగీకరించి జాయింట్ సర్వే చేయాలని నిర్ణయించింది. సీడబ్ల్యూసీ ఆదేశాలతో ఇటు పీపీఏ, అటు ఏపీ సైతం దిగిరాక తప్పని పరిస్థితి నెలకొన్నది.
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లోని 6 గ్రామాల్లో 899 ఎకరాల భూమి ముంపు పరిధిలోకి వస్తుందని సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లలో మార్ చేసి చూపించారని తెలంగాణ గతంలోనే నివేదించింది. భద్రాచలంలోని 8 అవుట్ఫాల్ తూముల లెవల్స్ను మరోసారి నిర్ధారించాల్సి ఉంటుంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు గతంలో పోలవరం ప్రాజెక్టులో ఎఫ్ఆర్ఎల్ వద్ద నీరు నిల్వ ఉన్నప్పుడు ముర్రేడు, కిన్నెరసాని వాగుల నీటి ప్రవాహాలపై ఉండే ప్రభావాలను అంచనా వేసి ఆ ప్రభావిత ప్రాంతాలను డీమార్క్ చేయాల్సి ఉన్నది. అదనంగా మొదటిదశలో మరో 6 పెద్దవాగులపై అటువంటి ప్రక్రియ చేపట్టాలని సీడబ్ల్యూసీ స్పష్టంగా పీపీఏకు, ఏపీకి సూచించింది. అదేవిధంగా మణుగూరు భారజల ప్లాంట్, భద్రాచలం రామాలయం పరిసర ప్రాంతాల్లో కూడా సర్వే చేసి ముంపు ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలను గుర్తించాలని పీపీఏను ఆదేశించింది. కానీ ఏపీ మాత్రం ఇప్పటికీ అందులో కేవలం ఒక్క బూర్గంపాడు ముంపునకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే తెలంగాణకు అందజేసింది. జాయింట్ సర్వేకు సీడబ్ల్యూసీ సూచించిన ఇతర అంశాలపై ఇప్పటికీ నోరుమెదకపోవడం ఏపీ ఉదాసీన వైఖరిని తెలియజేస్తున్నది.