హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్, శ్రీశైలం ఎడమగట్టు కేంద్రాల నుంచి తెలంగాణ కొనసాగిస్తున్న విద్యుత్తు ఉత్పత్తిని వెంటనే నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కేఆర్ఎంబీ చైర్మన్కు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి శుక్రవారం లేఖను రాశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గిపోయినా, విద్యుత్తు ఉత్పత్తిని తెలంగాణ నిరంతరాయంగా కొనసాగిస్తున్నదని ఆయన లేఖలో ఆరోపణలు చేశారు. దీంతో ప్రాజెక్టుల నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతున్నదని, ఇలాగే కొనసాగితే వేసవి నాటికి నీటికష్టాలు తప్పవని అందులో వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా శ్రీశైలం ఎడమ కాల్వకు సంబంధించి ఇటీవల వర్షాలకు గండిపడిన మైలవరం బ్రాంచ్ కెనాల్ మరమ్మతు పనులను తక్షణమే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది.