అనుకున్నదంతా జరుగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటే సత్యమని రుజువవుతున్నది. మన బాయికాడ మోటర్లకు కరెంటు మీటర్లు పెడతారని, ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తారని.. కేంద్రం రాష్ర్టాల మెడపై కత్తి పెట్టి దీన్ని అమలు చేయిస్తున్నదని కేసీఆర్ చేసిన హెచ్చరిక అక్షరాలా నిజమవుతున్నది. ఆంధ్రప్రదేశ్ అంతటా మీటర్లు పెడుతున్నట్టు ఆ రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించారు.
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరిక ఏపీ కేంద్రంగా వాస్తవ రూపం దాల్చింది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిమితిని స్వల్పంగా పెంచుకునేందుకు అవకాశం ఇస్తామని కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు ఆశపెట్టిన తాయిలానికి ఏపీ సర్కారు ఓకే అన్నది. నయానో భయానో పలు రాష్ర్టాలు మోదీ సర్కారు ముందు మోకరిల్లినా.. తెలంగాణ సర్కారు మాత్రం ససేమిరా అంటూ వస్తున్నది. అయితే.. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణల అమలుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ప్రయోగాత్మకంగా చేపట్టిన మోటర్లకు విద్యుత్తు మీటర్ల బిగింపును ఇక రాష్ట్ర వ్యాప్తం చేయనున్నట్టు ప్రకటిస్తూ ఆ రాష్ట్ర రైతాంగానికి షాక్ ఇచ్చింది.
వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు మీటర్లను బిగించేందుకు శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్ విజయవంతమైందని, దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన వ్యవసాయ, ఉద్యాన శాఖలపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ మోటర్లకు విద్యుత్తు మీటర్లను బిగించేందుకు శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో దాదాపు 30% విద్యుత్తు ఆదా అయిందని, కనెక్షన్లు పెరిగినప్పటికీ 33.75 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అయిందని తెలిపారు. ఇప్పటివరకు రైతులు వాడని కరెంటును సైతం ఉచిత విద్యుత్తు పేరుతో లెక్కగడుతున్నామని, మీటర్ల బిగింపుతో రైతులకు నాణ్యమైన కరెంటు అందటంతోపాటు విద్యుత్తు సిబ్బందిలోనూ జవాబుదారీతనం పెరిగిందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి, సీఎస్ సమీర్శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేంద్రం బెదిరింపులకు లొంగని సీఎం కేసీఆర్
విద్యుత్తు సంస్కరణలను అమలు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంకునేందుకు అవకాశం ఇస్తామని నరేంద్రమోదీ సర్కార్ రాష్ర్టాలను ఆశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లినప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మోదీ సర్కార్ బెదిరింపులకు లొంగలేదు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచుకోవడం కంటే రాష్ట్ర రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించే ప్రసక్తే లేదని కేంద్రానికి తేల్చిచెప్పారు.