Chandrababu | తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ముందుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావని, సమస్యలు పరిష్కారం కావని, అభివృద్ధి జరగదని తెలిపారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. గొడవల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. సానుకూల చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తే రెండు తెలుగు రాష్ట్రాలకు మంచిదని హితవు పలికారు.
రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు అని చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఏపీలో టీడీపీ విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని తెలిపారు. తెలంగాణ నుంచి లక్షలాది మంది ఏపీకి వచ్చి ఓటేశారని పేర్కొన్నారు. ఎన్నికల గెలుపులో హైదరాబాద్లో ఉన్న తెలుగువారు కీలకమని చెప్పారు.
వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.