హైదరాబాద్: ప్రధాని మోదీ ఈ నెల 12న రాష్ట్రంలో పర్యటించనున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు గాను ప్రధాని మోదీపై కార్మిలోకం భగ్గుమంటున్నది. ఆయన పర్యటనను అడ్డుకుంటామని, నల్లజెండాలతో నిరసన తెలుపుతామని ఇప్పటికే పలు కార్మిక సంఘాలు ప్రకటించాయి. తాజాగా మోదీ నో ఎంట్రీ అంటూ హైదరాబాద్లో ఫ్లెక్సీలు వెలిశాయి. చేనేతపై విధించిన జీఎస్టీని వెనక్కి తీసుకున్న తర్వాతే తెలంగాణలో అడుగు పెట్టాలంటూ.. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
గతంలో కూడా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా హైదరాబాద్తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని, ఎన్ని నిధులు ఇచ్చిందని ప్రశ్నల వర్షం కురిపించారు.