Bhadrachalam | భద్రాచలం : శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రాచలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఆరు అంతస్థుల భవనం బుధవారం కూలిన ఘటన విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారికోసం గత రెండు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.
శుక్రవారం తెల్లవారుజామున శిథిలాల నుంచి మరో మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికి తీసింది. మృతుడిని తాపీ మేస్త్రి ఉపేందర్గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం ఉపేందర్ డెడ్బాడీని ఆయన కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. గురువారం శిథిలాల్లో చిక్కుకుపోయిన తాపీమేస్త్రి కామేశ్వర్రావును అధికారులు ప్రాణాలతో బయటకుతీశారు. కానీ అప్పటికే కాలు, చెయ్యి నుజ్జునుజ్జయి, తీవ్ర రక్తస్రావం జరిగిన కామేశ్వర్రావు దవాఖానకు తరలించిన వెంటనే ప్రాణాలు వదిలాడు.
శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో బీరువా లాంటి లాకర్ ఒకటి లభ్యమైంది. అందులో విలువైన బంగారం, నగదు, వివిధ పత్రాలు ఉండడంతో అధికారులు పోలీసు స్టేషన్కు తరలించారు. ఐటీడీఏ పీవో రాహుల్, ఆర్డీవో దామోదర్రావు, ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్, డీఎఫ్వో క్రాంతికుమార్ పర్యవేక్షిస్తున్నారు. సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పంచాయతీ, ఐటీసీ అధికారులు, సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ, ఆనవాళ్లు పరిశీలిస్తూ ముందుకెళ్తున్నారు.