Darigam Forest | కుమ్రంభీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కాగజ్నగర్, జనవరి 8 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం దరిగాం అడవుల్లో మరో పులి మృత్యువాత పడిన విషయాన్ని అటవీ అధికారులు గుర్తించారు. సోమవారం సీసీఎఫ్ శాంతారాం, డీఎఫ్వో నీరజ్కుమార్ టెబ్రీవాల్, ఎఫ్ఆర్వో వేణుగోపాల్ సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. ఇదే ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం ఓ పులి కళేబరాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఆ ఘటన వెలుగు చూసిన మరుసటి రోజే మరో పులి కళేబరం లభించడం ఆందోళన కలిగిస్తున్నది. రెండో పులికోసం గాలిస్తున్న ట్రాకింగ్ బృందానికి.. మొదట చనిపోయిన పులి ప్రాంతానికి కొద్ది దూరంలోనే చిన్న నీటి మడుగులో మరో పులి కళేబరాన్ని సోమవారం గుర్తించారు. పులుల మధ్య జరిగిన ఘర్షణలోనే ఇది కూడా మృత్యువాత ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ ఇంకా నిర్ధారణ కాలేదు. రెండో పులి కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించిన తరువాతే ధ్రువీకరించనున్నారు.
అయితే అక్కడి పరిస్థితులను పరిశీలిస్తే వేటగాళ్ల ఉచ్చుకే ఈ పులి బలైనట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘర్షణ పడిన రెండు పులుల్లో ఒక పులి చనిపోగా గాయపడిన రెండో పులి ఇదికాదని తెలుస్తున్నది. ఇది మగ పులి అని సమాచారం. అటవీ అధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఘటనా స్థలానికి మీడియాను అనుమతించడం లేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. కాగజ్నగర్ డివిజన్లో వరుస ఘటనలు చోటుచేసుకోవడంతో అటవీ శాఖ అధికారులపై వేటు పడుతుందన్న ప్రచారం జరుగుతున్నది. మంగళవారం రాష్ట్ర స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చి పరిశీలించనున్నట్టు సమాచారం.
చిరుత దాడిలో ఆవు మృత్యువాత
ఆదిలాబాద్ జిల్లాగుడిహత్నూర్ మండలం సంభుగూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల చిన్నమన్నూర్లో ఆదివారం రాత్రి చిరుత దాడి చేసి ఆవును చంపేసింది. చిన్నమన్నూర్కు చెందిన పెందూర్ తిరుపతి ఆవులను గుట్ట వద్ద తన చేనులో మేపుతుంటాడు. ఆదివారం రాత్రి చేను వద్దే ఆవులను కట్టేసి, అక్కడే పడుకున్నాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో చిరుత ఆవుల మందపై దాడి చేసింది. ఓ ఆవు చనిపోయింది. సోమవారం ఉదయం అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. చిరుత దాడిలోనే ఆవు మృతిచెందినట్టు బీట్ ఆఫీసర్ కృష్ణనాయక్ తెలిపారు.