తొగుట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాగుందని జాతీయ రైతు సంఘాల నాయకులు ప్రశంసించారు. దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 75 మంది రైతు ప్రతినిధులు.. రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. మొదట పంప్ హౌస్ను సందర్శించారు. వారికి నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరే రామ్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు నుండి ఆనకట్టలు, బ్యారేజ్లు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం గురించి వివరించారు. ఈ సందర్భంగా పంప్ హౌస్ను చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 100 మీటర్ల లోతులో ఇంత పెద్ద పంప్ హౌస్ నిర్మించడం బాగుందని ప్రశంసించారు. నీళ్లు లేని చోట 200 కిలోమీటర్ల నుండి నీళ్ళు తీసుకొచ్చి కరువును దూరం చేసిన సీఎం కేసీఆర్ను వారు ప్రశంసించారు.
పంజాబ్ తదితర రాష్ట్రాల్లో రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ తలా రూ. 3 లక్షల చొప్పున పరిహారం చెల్లించడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ తరహాలో తమ రాష్ట్రాల్లో పథకాలు అమలు చేయాలని, సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని వారు నొక్కి చెప్పారు. అనంతరం మల్లన్న సాగర్ డెలివరీ చానల్ దగ్గరకు వెళ్లి ప్రాజెక్టులో నీళ్ళు చూసి వారు సంతోషం వ్యక్తం చేశారు. నీళ్లు లేని చోట ప్రాజెక్టు నిర్మించి నీటిని నిలువ చేసి పంట పొలాలకు తరలించడం బాగుందన్నారు. ప్రాజెక్టు వద్ద సెల్ఫీలు దిగేందుకు రైతులు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షులు వంగ నాగిరెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.