ఢిల్లీ : ఇంధన పరిరక్షణ రంగంలో చేస్తున్న కృషికి గాను తెలంగాణకు మరో జాతీయ అవార్డు వరించింది. గ్రూప్ 2లోని రాష్ట్రాల్లో తెలంగాణకు నిర్దేశిత సంస్థగా ఉన్న తెలంగాణ పునరుత్పాధక ఇంధన అభివృద్ధి సంస్థ(రెడ్కో) సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకుంది. 32వ జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య ఈ అవార్డును అందుకున్నారు.
చైర్మన్ సతీశ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రెడ్కో సంస్థ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాల వాడకాన్ని తగ్గించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ను మున్సిపల్ యాక్ట్ లో చేర్చిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందన్నారు.విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా భవన నిర్మాణ దశ నుంచే చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పరిశ్రమల్లోనూ విద్యుత్ ఆదా అయ్యే విధంగా యంత్రాల వినియోగం, మార్పులపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో నాసిరకం మోటార్లతో అధిక విద్యుత్ వినియోగం జరగకుండా వాటి స్థానంలో స్టార్ రేటెడ్ మోటార్ల ఏర్పాటుకు రైతులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, పోస్టాఫీసులు, పోలీస్ స్టేషన్లు, స్కూళ్లు, దేవాలయాల్లో తక్కువ విద్యుత్ తో పనిచేసే ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశామని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటన్నింటిని గుర్తించిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రాష్ట్రానికి అవార్డు ప్రకటించిందని తెలిపారు. సంస్థకు వెన్నంటి ఉండి సహాయసహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ , ఐటీ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.