అడవిదేవులపల్లి, జనవరి 25: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న క్రమంలో ఫైనాన్స్ వేధింపులు ఎక్కువై ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఏకుల ఉపేందర్ (24) ప్రైవేటు ఫైనాన్స్లో ప్యాసింజర్ ఆటో తీసుకున్నాడు. రోజూ అడవిదేవులపల్లి నుంచి మిర్యాలగూడ రూట్లో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటోలకు గిరాకీ లేకుండా పోయింది. దాంతో ఉపేందర్ ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాడు. ఆటో నెలవారీ వాయిదాలు చెల్లించాలని ఫైనాన్స్ వారు ఒత్తిడి చేయడంతో మనోవేదనకు గురయ్యాడు. బుధవారం రాత్రి తన ఇంటి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. కుటుంబాన్ని ఆదుకుంటాడనుకుంటే ఆత్మహత్య చేసుకుండని ఉపేందర్ తల్లి ఏకుల లింగమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇంతకాలం ఆటో నడిపి తెచ్చిన డబ్బుతో ఇల్లు గడిచేదని, బస్సుల్లో మహిళలను ఉచితంగా తీసుకెళ్తుండటంతో నెల రోజుల నుంచి ఇల్లు గడవడం కష్టమైందని చెప్పింది. మార్పు రావాలని తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడని రోదించింది. మిర్యాలగూడ ఏరియా దవాఖానలో మృతుడి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.