హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, హిందీ, పీడీ)గా పనిచేస్తున్న మరో 1,440 మంది టీచర్లను విద్యాశాఖ బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. వీరి బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అధికారులు ఆయా జిల్లాల డీఈవోలకు పంపించారు. బదిలీ అయిన టీచర్లు సోమవారం రిలీవ్ అయ్యి మంగళవారం బదిలీ అయిన స్థానంలో చేరాలని ఆదేశాలిచ్చారు. వాస్తవానికి మల్టీజోన్ -1లోని స్కూల్ అసిస్టెంట్లను గత వారమే బదిలీ చేశారు. ఈ 1,440 మంది స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పలు కారణాల వల్ల నిలిచిపోయాయి. తాజాగా అన్ని రకాల అడ్డంకులు తొలగిపోగా, వీరిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.