దేవరుప్పుల, జూలై 1: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత క్రాంతి పథకం చిందు యక్షగాన కళాకారుల కుటుంబాల్లో సంక్రాంతిని నింపనున్నదని రాష్ట్ర హంస అవార్డుగ్రహీత, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారులు దేవరుప్పులలోని జాతీయ రహదారిపై గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గడ్డం సమ్మయ్య మాట్లాడుతూ.. దళిత సాధికారత పథకం దేశంలోనే కనీవినీ ఎరుగని పథకమని కొనియాడారు. రూ.1,200 కోట్లతో ప్రకటించిన ఈ పథకంలో నియోజకవర్గంలో వంద మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థ్ధికసాయాన్ని అందించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపడం సామాన్య విషయం కాదన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్, కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటిపై యక్షగానం రూపంలో అర్థమయ్యేలా వివరించి ప్రజలను ఆకట్టుకున్నారు.