హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగా ణ): రంగారెడ్డి జిల్లా రావిర్యాల్లో రూ.245 కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న విజయ మెగా డెయిరీని ఆగస్టులో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పాల సేకరణ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలవారీగా సమీక్షించి, నివేదికను సమర్పించాలని సూచించారు. సోమవారం మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, 125 అడుగుల అంబేదర్ విగ్రహం తదితర పర్యాటక ప్రదేశాల్లో ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో నాణ్యమైన పశుసంపద అభివృద్ధి కోసం రంగారెడ్డి జిల్లా ఫారూక్నగర్ మండలం కంసాన్పల్లిలో 37 ఎకరాల్లో రూ.22 కోట్లతో పశువీర్య ఉత్పత్తి కేంద్రం నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. 17 ఎకరాల్లో పశుగ్రాసం పెంచేలా పనులు జరుగుతున్నాయిని చెప్పారు. పశువీర్య ఉత్పత్తి కేంద్రం అందుబాటులోకి వస్తే ఏటా 10 లక్షల డోసుల వీర్యం ఉత్పత్తి జరుగుతుందని వివరించారు. రైతులకు శిక్షణ కార్యక్రమాల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు కోసం రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 55 ఎకరాల స్థలం, నిర్మాణం కోసం రూ.18.50 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. అక్కడే కృత్రిమ గర్భధారణపై పశువైద్యులకు శిక్షణ కేంద్రం నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మృగశిర కార్తె సందర్భంగా జూన్ 7, 8, 9 తేదీల్లో అన్ని జిల్లాల్లో ఫిష్ఫుడ్ ఫెస్టివల్స్ను ఘనంగా నిర్వహించాలని మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను తలసాని ఆదేశించారు. కొత్తగా 100 మొబైల్ ఫిష్ ఔట్లెట్ల ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధంచేయాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా ఇప్పటి వరకు 38 వేల మందికిపైగా మత్స సహకార సంఘాల్లో సభ్యత్వం ఇచ్చినట్టు వెల్లడించారు.
గొర్రెల పంపిణీ రెండో విడతకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించా రు. లబ్ధిదారులు వాటా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జాబితాలోని లబ్ధిదారుల్లో ఎవరైనా మరణిస్తే వారి నామినీ పేరును చేర్చేలా చేర్చాలని డైరెక్టర్ రాంచందర్కు సూచించారు. సమావేశంలో విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్కుమార్ గుప్తా, షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీరోజిరావు తదితరులు పాల్గొన్నారు.