హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం (Anil Kurmachalam) పట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.
నేడు ఉమ్మడి నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటర్లంతా విజ్ఞతతో ఆలోచించి ప్రజల పక్షాన ప్రశ్నించే బీఆర్ఎస్ గొంతుకు మద్దతుగా నిలిస్తే కేవలం పట్టభద్రుల సమస్యల కోసమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు అండగా ఉండి పోరాడుతారని, కావున రాకేష్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు.
పట్టభద్రుల పట్ల సమాజంలో ప్రత్యక గౌరవముందని, ఇలాంటి సమయాల్లో ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా సమర్ధవంతమైన అభ్యర్థికి ఓటెయ్యాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందికి గురి చేసిందన్నారు. ప్రపంచవ్యాప్త ఎన్నారైలంతా రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు.