హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్)గా ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్) అనిల్కుమార్కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఇప్పటివరకు ఎవరినీ నియమించని ప్రభుత్వం.. రెగ్యులర్ ఈఎన్సీ (జనరల్)ని నియమించే వరకూ ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్) అనిల్కుమార్కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
అదేవిధంగా ఈఎన్సీ జనరల్కు సంబంధించిన పలు బాధ్యతలను మరో ఇద్దరు అధికారులను కేటాయించింది. స్టేట్లెవల్ స్టాండింగ్ కమిటీ, ఐబీఎం కమిటీ, స్టేట్ లెవల్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, స్కివమ్, ఓఅండ్ఎం కమిటీ చైర్మన్గా, కమిషనర్ ఆఫ్ టెండర్స్గా, బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్, కాళేశ్వరం కార్పొరేషన్, జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్, మూసీ రివర్ ఫ్రంట్, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, తుంగభద్ర బోర్డుల మెంబర్ తదితర బాధ్యతలను ఈఎన్సీ అనిల్కుమార్కు అప్పగించింది.
నాగేందర్రావుకు ఇంటర్ స్టేట్ వ్యవహారాలు
అంతర్రాష్ట్ర జలవివాదాలు, ఇతర రాష్ర్టాలతో సంప్రదింపులు, నీటి కేటాయింపుల అంశంపై కేంద్రంతో సంప్రదించే బాధ్యతలతోపాటు, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్ యాక్టివిటీలను ఈఎన్సీ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) నాగేందర్రావుకు ప్రభుత్వం అప్పగించింది. మైనర్ ఇరిగేషన్, ఐడీసీ లిఫ్ట్లు, కాడా, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పనుల బాధ్యతలను చీఫ్ ఇంజినీర్ కేఎస్ఎస్ చంద్రశేఖర్కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.