నారాయణఖేడ్, ఫిబ్రవరి 12: నాణ్యమైన భోజనం పెట్టడంలేదని ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డెక్కారు. అన్నం ప్లేట్లను జాతీయ రహదారిపై విసిరేసి నిరసన తెలిపారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూకల్ శివారు గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 200 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్ని రోజులుగా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, ఉడికీ ఉడకని అన్నం, చారు ఇస్తున్నారని, మంచి భోజనం ఇవ్వాలని పలుమార్లు ప్రిన్సిపాల్ బాలమణితో మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో అన్నం ప్లేట్లను నిజాంపేట్- బీదర్ జాతీయ రహదారిపై విసిరేసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టినట్టు పేర్కొన్నారు.
రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా పోలీసులు చేరుకుని విద్యార్థులను సముదాయించి ఆందోళనను విరమింపజేశారు. విషయం తెలుసుకున్న జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి నీలిమాకుమారి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఘటనపై సంజాయిషీ కోరుతూ ప్రిన్సిపాల్కు షోకాజ్ నోటీసు జారీచేశారు.
నారాయణఖేడ్ గిరిజన ఆశ్రమ పాఠశాల ఘటనపై మాజీ మంత్రి హరీశ్రావు స్పందించారు. గురుకులాల్లో మంచి భోజనం కోసం విద్యార్థులు రోడ్డెక్కడమే ఇందిరమ్మ రాజ్యమా అన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట గురుకుల విద్యార్థులు భోజనం విషయంలో ఇబ్బందులకు గురవుతున్నా విద్యాశాఖమంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి ఉలుకూపలుకు లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
నిత్యం గాలి మోటర్లలో చక్కర్లు కొట్టే సీఎం గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఓవైపు గురుకులాల ఖ్యాతిని మసకబార్చిన రేవంత్రెడ్డి , మరోవైపు అంచనాలు పెంచి కమీషన్లు దండుకోవడానికి యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట భారీ నాటకానికి తెరతీశారని ఆరోపించారు. ఇప్పటికైనా విద్యాశాఖపై దృష్టి సారించి గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారుచేశారు.