సిరిసిల్ల టౌన్, మార్చి 7: రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని నేతన్నలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపులు ఆపడంలేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తమకు మద్దతు తెలుపలేదంటూ నేతన్నలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల మున్సిపల్ 12వ వార్డు పరిధిలోని చంద్రంపేటలో గడ్డం ప్రసాద్ అనే నేత కార్మికుడి కార్ఖానాకు సెస్ అధికారులు బకాయి పేరిట విద్యుత్తు కనెక్షన్ కట్చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బ్యాక్ బిల్లింగ్పై ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా పెండింగ్లో పెట్టింది. దీంతో వస్త్ర పరిశ్రమ సైతం కుదేలైంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో కార్మిక క్షేత్రంలో పర్యటించిన మంత్రులు.. నేతన్నలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, పెండింగ్ బిల్లులు సైతం క్లియర్ చేస్తామని ప్రకటించారు.
అయితే 12వ వార్డు నుంచి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు సతీమణి పోటీ చేసింది. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మొగిలి నాగరాజు గెలుపొందారు. ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో కాంగ్రెస్ నాయకుడు సూర దేవరాజు జీర్ణించుకోలేకపోయాడు. తమకు సపోర్ట్ చేయలేదనే అక్కసును వివిధ రకాలుగా వెళ్లగక్కుతున్నాడు. సదరు కాంగ్రెస్ నాయకుడి ఫిర్యాదుతో ఆగమేఘాల మీద స్పందించిన అధికారులు నేత కార్మికుడు గడ్డం ప్రసాద్ సోదరుడు గడ్డం ప్రభాకర్, నానమ్మ తులసమ్మ పేరిట ఉన్న విద్యుత్తు కనెక్షన్లకు బ్యాక్ బిల్లింగ్ పేరిట శనివారం నోటీస్ అందించారు. 15 రోజుల్లో ప్రభాకర్ పేరిట రూ.19.83 లక్షలు, తులసమ్మ పేరుతో బ్యాక్ బిల్లింగ్ రూ.23.61 లక్షలు చెల్లించాలని నోటీస్లను సెస్ ఎండీ పోస్ట్ ద్వారా పం పించారు.
నోటీసులు ఇచ్చిన వెంటనే ప్రభాకర్కు చెందిన కార్ఖానాకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. వస్త్ర పరిశ్రమలో సుమారు 123 కార్ఖానాలపై బ్యాక్ బిల్లింగ్ విషయం పెండింగ్లో ఉండగా, ఒక గడ్డం ప్రభాకర్కు చెందిన కార్ఖానాకు బ్యాక్ బిల్లింగ్పై బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే సెస్ అధికారులు నోటీసులు పంపడం, విద్యుత్ కనెక్షన్ కట్ చేయడంపై స్థానిక కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకులు, వస్త్ర పరిశ్రమలోని ఆసాములు ఆగ్రహం వ్యక్తంచేయడంతో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు.