హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ విద్యను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. పాఠశాల విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ విద్య లేని లోటును గమనించిన రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల నుంచి ఆరేండ్ల లోపు విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నర్సరీ విద్య కూడా అందించాలని ఉద్దేశ్యంతో అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించడం వల్ల నర్సరీ నుంచి నేరుగా ప్రాథమిక విద్యకు విద్యార్థులను సంసిద్ధం చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంయుక్త నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్.. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లో రెండు శాఖల ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు.
అంగన్వాడీ కేంద్రాలు అంటే కేవలం పౌష్టికాహారం అందించడానికే పరిమితం కాదని, ఆ కేంద్రాల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్య అందించడంతో పాటు పిల్లలను ప్రాథమిక విద్య కొనసాగించడానికి ముందునుంచే పాఠశాలలకు పరిచయం చేయాలని, తద్వారా మధ్యలో బడి మానేయడాన్ని కట్టడి చేయాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలలో ఇప్పటికే 15,167 అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నడుస్తున్నాయని తెలిపారు. 11,185 అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలు ఉండగా, 12,174 కేంద్రాలు కిరాయి లేకుండా ఇతర భవనాలల్లో నడుస్తున్నాయని, మరో 12,219 కేంద్రాలు కిరాయి భవనాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మొదటగా కిరాయి భవనాల్లో నడుస్తున్న ఈ అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించాలని, త్వరలోనే దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపడుతామని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా సంక్షేమ అధికారులు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తామన్నారు. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు.
కోవిడ్ కారణంగా ప్రభుత్వ విద్య పట్ల తల్లిదండ్రులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, దీనిని గమనించి ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడం కోసం అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించడం వల్ల పిల్లలకు పాఠశాలలు పరిచయం అవుతాయని, స్కూల్ భయం పోతుందని, మధ్యలో బడి మానేయడం ఆగుతుందని చెప్పారు.
అనంతరం సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్టేట్ హోమ్ లోని పిల్లలకు మంత్రులు ఇద్దరు కలిసి స్టేషనరీ వస్తువులు కలిగిన బ్యాగులు అందించారు. విద్యార్థులకు చేయుత అందించేందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థ నిర్వహకులను అభినందించారు. ఈ సమీక్ష సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య దేవరాజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ దేవసేన, ఇతర డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.