హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): అది టేకులబోరు గ్రామం. జోరువాన కురుస్తున్నది. చీకటి పడుతున్నది. వేడివేడిగా టీ తాగుదామని ఒక హోటల్ దగ్గర ఆగాం. ఇంతలో వాన తగ్గింది. అక్కడే అంబేద్కర్ బొమ్మ దగ్గర ఓ ఆరుగురు కూర్చున్నారు. వాళ్లంతా గోదావరి వరదలకు గూడు కూలి.. సర్వం కోల్పోయినవారు. ఒక పెద్దాయనతో మాట కలిపాం. ‘తెలంగాణ సర్కారే లేకుంటే మేమసలు ఎప్పుడో గోదాట్లో కలిసిపోయేవాళ్లమయ్యా..’ అంటూ ఆయన తన గుండె వేదన చెప్తుంటే మరికొందరు అక్కడికి వచ్చారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి మారుతుందనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు అక్కడ కూర్చున్న పసుపులేటి కృష్ణ, పుట్ట ముత్యం, సూరం శ్రీను, ఎడ్ల రాములు, వెంకట్, పత్తిపాటి సాంబయ్య. గోదావరి వరదల తర్వాత అక్కడి ప్రజల జీవన విధానం ఎలా ఉన్నదనే విషయం తెలుసుకొనేందుకు ‘నమస్తే తెలంగాణ’ బృందం విలీన మండలాల్లో పర్యటించింది.
ఎటపాక, రాయన్నపేట ఎస్సీకాలనీ, చోడవరం, గుండాల, వెంకట్రావుపేట, కూనవరం, భీమవరం, టేకులబోరు, నర్సింగపేట, వీఆర్పురం, ఏడుగురాళ్లపల్లి, కొమ్మూరు, చింతూరు, రేగళ్లపాడు, చట్టి, అరవాయిగూడెంతోపాటు కుక్కునూరు మండలంలోని వేలేరు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా విలీన మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేయాలని, తెలంగాణ తరహా పథకాలను అమలు చేయాలన్న ఆకాంక్షను ప్రతి ఒక్కరూ వ్యక్తంచేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే.. దేశానికి చాలా మేలు జరుగుతుందని, ఆయన వెంటే నడుస్తామని చెప్పారు. తెలంగాణలో 24 గంటలూ కరెంట్ ఇస్తుంటే.. తాము మాత్రం కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దయనీయస్థితిలో చిక్కుకొన్నామని తెలిపారు. వరదలు వచ్చి రెండు నెలలైనా తాము ఇంకా చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన చెందారు. తెలంగాణ వెలుగులు దేశమంతా ప్రకాశించాలని ఆకాంక్షించారు. నాడు పల్లేర్లు మొలిచిన తెలంగాణ మడిలో.. నేడు కేసీఆర్ పాలనలో బంగారం పండుతున్నదని సంతోషించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇన్ని మంచి పనులు చేస్తున్న కేసీఆర్ దేశ ప్రధానిగా ఉంటే.. ఇంకెంత చేయగలరోనన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు. విలీన మండలాల్లోని సామాన్యులతోపాటు వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.
దేశంలో ఎవరి బతుకులూ బాలేవు
నేను డిగ్రీ చదివా. మిషన్ కుడుతున్నా. నేను తెలంగాణలో ఉంటే ఉద్యోగం దొరికేది. దేశంలో ప్రస్తుతం ఏ వర్గం వాళ్లు సంతోషంగా లేరు. కానీ, తెలంగాణలో రైతులు, యువకులు, ఉద్యోగులు ఇలా అందరూ సంతోషంగా ఉన్నారు. దేశమంతా అలా ఉంటే ఎంతో బాగుంటుంది. కేసీఆర్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి తెలంగాణ ఉద్యమమే ఉదాహరణ. ఆ తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమమే నిదర్శనం.
– ముద్దసం రేణుక, టైలర్, చట్టి, చింతూరు మండలం
బీటెక్ చదివి కటింగ్ చేస్తున్నా
నేను బీటెక్ చదివా. చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నా. జీతం చాలక రోజూ కొంతసేపు క్షవరాలు చేస్తున్నా. అప్పుడప్పుడు మా నాన్న అంటుంటాడు. ఏమీ చదవని నాకు, ఎంతో చదివిన నీకు తేడా ఏముందిరా? అని. అప్పుడు నా కండ్లలో నీళ్లు తిరుగుతాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న మోదీ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. తెలంగాణలో సుమారు లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకో 80 వేల ఉద్యోగాలు ఇస్తున్నారు. దేశంలో కేసీఆర్ వంటి నేత కరువయ్యాడు.
– కూనారపు మహేంద్ర, భీమవరం, కూనవరం మండలం
కేసీఆర్ కోసం 2 లక్షల మందితో సభ పెడతా
ఉద్యమాలు మాకు కొత్త కాదు. బ్రిటిషోళ్లకు వ్యతిరేకంగా మా తాతలు కొట్లాడారు. తెలంగాణ కోసం కేసీఆర్తో కలిసి అడుగులేశాం. ఆ తర్వాత మమ్మల్ని ఆంధ్రాలో కలిపేశారు. గిరిజనులు, దళితులను హీనంగా చూస్తున్నా.. మనసు చంపుకొని బీజేపీలో ఉన్నాను. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ఆయన వెంటే నడుస్తాం. 1998లో భద్రాచలం పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే, నాకు 1.53 లక్షల ఓట్లు వచ్చాయి. త్వరలో హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని కలుస్తాం. ఆయన అంగీకరిస్తే.. రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం.
– కుర్సం సుబ్బారావు, బీజేపీ ఏపీ రాష్ట్ర నేత
కేసీఆర్ వస్తే.. దేశమంతా గొర్రెల పంపిణీ
తెలంగాణలో కేసీఆర్ గొల్ల, కురుమల కోసం ఉచితంగా గొర్రె పిల్లలను పంపిణీ చేస్తున్నారు. ఏపీలో ఆ పరిస్థితి లేదు. మా బంధువులు ఖమ్మం జిల్లాలో ఉంటున్నారు. ఒకప్పుడు కూలీలు. ఇప్పుడు మాకన్నా ఎకువ గొర్రెల మందకు యజమానులు. మా పరిస్థితి దయనీయం. నెలో, రెండు నెలలో చూసి ఈ మందను అమ్మేస్తాం. గొర్రెలకు రోగమొస్తే మందులిచ్చే దికేలేదు. కేసీఆర్ ప్రధాని కావాలి. ఆయన వస్తే.. దేశమంతా గొర్రెలిస్తరు. ఆ నమ్మకం మాకు ఉన్నది.
– కొరిమి దిలీప్, వెంటకట్రావుపేట
తెలంగాణ సంక్షేమం.. దేశమంతా కావాలి
ఒకప్పుడు తెలంగాణలో ఉన్నాం. మోదీ అన్యాయంగా మమ్మల్ని ఏపీలో కలిపేశాడు. మాకే ఎన్నోసార్లు అనిపిస్తుంది- కేసీఆర్ వంటి సీఎం మాకెందుకు లేడని? అకడి సంక్షేమం ఇకడెందుకు లేదని? కేసీఆర్ తెలంగాణకే పరిమితం కాకూడదు. ఆయన సేవలు, మేథస్సు దేశమంతటికీ కావాలి. తెలంగాణలోని సంక్షేమం ప్రతి రాష్ట్రంలో అమలు కావాలి.
– మండ దుర్గాప్రసాద్, సీపీఐ నాయకుడు, చింతూరు
దేశంలో రైతు ప్రభుత్వం రావాలి
దేశంలో రైతు ఉనికే ప్రమాదంలో పడింది. వ్యవసాయ చట్టాలు, మోటర్లకు మీటర్లు అందుకు సంకేతాలు. తెలంగాణలో తప్ప దేశంలో మరెకడా రైతులు సంతోషంగా లేరు. మోదీ కార్పొరేట్లకు మాత్రమే చుట్టం. దేశం కేసీఆర్ వంటి రైతు నేత కోసం చూస్తున్నది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రాకపోతే.. దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడేలా ఉన్నది.
– గోటేటి రవికుమార్, మాజీ జడ్పీటీసీ, టీడీపీ నేత, ఎటపాక
దేశాన్ని నడిపే నేత కేసీఆర్
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. ప్రస్తుతం దేశాన్ని సక్రమ మార్గంలో నడుపగలిగే గొప్ప నేత కేసీఆర్. దేశంలో సీబీఐకి, ఈడీ కి, మోదీకి, ఎవరికీ భయపడని ముఖ్యమంత్రి ఒక కేసీఆరే. కేసీఆర్ చెప్తున్నట్టు దేశమంతా ఉచిత విద్యుత్తు సాధ్యమే. తెలంగాణలో వలే దేశంలోని రైతులు మళ్లీ రాజులవడం ఖాయం.
– శ్యామల విజయ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, చింతూరు
భవిష్యత్తు ప్రధాని కేసీఆర్
సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా. ఇంతవరకూ కేసీఆర్ వంటి విజన్ ఉన్న నేతను చూడలేదు. బీజేపీలో అందరూ దొంగలే. భయపెట్టడం, మభ్యపెట్టడం, ప్రభుత్వాలను కూల్చడం, తప్పుడు కేసులతో వేధించడం తప్ప దేశానికి వాళ్లు చేసిందేమిటి? ప్రాంతీయ పార్టీలన్నీ కేసీఆర్కు అండగా నిలవాలి. లేదంటే ఆ పార్టీల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉన్నది.
– ఆకిశెట్టి ఉమాశంకర్ నాయుడు, రైతు, ఎటపాక
ఇదీ ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన కూనవరం బస్స్టాండ్ పరిస్థితి