హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సచివాలయ ఔట్ సోర్సింగ్ సిబ్బంది షాకిచ్చారు. వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఏకంగా మంత్రి చాంబర్కు తాళం వేసిన ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది. నిరుడు డిసెంబర్ నుంచి జీతాలు లేకపోవడంతో సహాయనిరాకరణకు దిగారు.
శుక్రవారం విధులకు వచ్చిన సిబ్బంది.. ఇక డ్యూటీకి వచ్చేది లేదని అధికారులకు చెప్పినా స్పందన కరువైంది. దీంతో సిబ్బంది మంత్రి చాంబర్కు తాళాలు వేసి, ఊర్లకు వెళ్లిపోయారు. సోమవారం కూడా చాంబర్ తెరుచుకోకపోవడంతో సిబ్బందికి అధికారులు ఫోన్లు చేస్తే, ఊరి నుంచి వచ్చేందుకు తమ వద్ద డబ్బులు లేవని సమాధానం చెప్పినట్టు తెలిసింది. తమ సమస్యకు పరిష్కారం చూపేవరకు తాళాలు తీసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో అధికారులు మంత్రి ఆఫీసులో, ఎక్కడ వీలైతే అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఏకంగా సెక్రటేరియల్లోని మంత్రి పేషీ మూతబడటం సంచలనంగా మారింది.