హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఆంధ్రా వ్యక్తిని నియమించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలోని నిరుద్యోగ యువత సోషల్మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నది. సభ్యులుగా నియమించేందుకు తెలంగాణకు చెందిన వారిలో అర్హులు ఎవరూ లేకుండా పోయారా? అని నిలదీస్తున్నది.
నియామకంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న మెంబర్ల పోస్టుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అందుకోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రస్తుతం 5 మందిని ఎంపిక చేసి గవర్నర్కు ప్రతిపాదనలు పంపగా ఆమె ఆమోదించారు. అనితా రాజేంద్ర, అమీర్ ఉల్లా ఖాన్, నర్రి యాదయ్య, పాల్వాయి రజనికుమారి, యరబాది రామ్మోహన్రావును సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సభ్యుడిగా రామ్మోహన్రావును నియమించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రాకు చెందిన వ్యక్తిని సభ్యుడిగా నియమించడంపై తెలంగాణ వాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ వ్యక్తిగానే గుర్తింపు
రామ్మోహన్రావుది కృష్ణా జిల్లా నందిగామ. ఆయన తండ్రి రాజరత్నం నీటిపారుదల శాఖలో డ్రైవర్గా శ్రీశైలం ప్రాజెక్టులో పనిచేశారు. తమ స్వస్థలం ఏపీలోని నంద్యాల జిల్లా సున్నిపెంటగా రామ్మోహన్రావు స్వయంగా చెప్పుకుంటారు. 1984లో ఆంధ్రా యూనివర్సిటీలో బీఈ సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 1986లో విద్యుత్తు శాఖలో శ్రీశైలం కుడిగట్టు విద్యుత్తు కేంద్రంలో ఏఈగా చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయనను తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించింది.
ఉద్యోగుల విభజన సందర్భంగా తెలంగాణ ఆప్షన్ ఎంచుకున్న 214 మందిలో ఆయన కూడా ఒకరు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించి చాలా రోజులపాటు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం టీఎస్జెన్కో ఈడీ (సివిల్, హైడల్)గా కొనసాగుతున్నారు. వచ్చే ఏప్రిల్లో పదవీ విరమణ పొందాల్సి ఉన్నది. పూర్తిగా ఆంధ్రాకు చెందిన వ్యక్తిని టీఎస్పీఎస్సీలో సభ్యుడిగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కమిషన్ సభ్యులుగా నియమితులైన వారిలో చాలా మంది తమతమ రంగాల్లో ప్రత్యేక నిపుణులు. విశిష్ట ప్రతిభ చూపి అవార్డులను అందుకున్నవారు కూడా ఉన్నారు. అలాంటిదేమీ లేకపోయినా కేవలం ఉద్యోగిగా చేసిన సేవల ఆధారంగానే రామ్మోహన్రావును సభ్యుడిగా నియమించడం గమనార్హం. దీనిపై ఇటు తెలంగాణ వాదులు, అటూ నిరుద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. 321 మంది దరఖాస్తు దారుల్లో తెలంగాణకు చెందిన అర్హులు ఒక్కరూ కనిపించలేదా? అని సోషల్మీడియా వేదికగా నిలదీస్తున్నారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.