ఆదిలాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మునుగోడు ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్రలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డాయని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో మహారాష్ర్టకు చెందిన యావత్మాల్, నాందెడ్, చంద్రాపూర్ జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని, రైతులు, కులవృత్తులు, ఇతర వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయంటూ ఆ గ్రామాల ప్రజలు ప్రశంసిస్తున్నారు.
తమ గ్రామాలను తెలంగాణలో కలుపాలని డిమాం డ్ చేస్తున్నారు. మునుగోడు ఎన్నికలపై తాము మొదటి నుంచీ ఆసక్తిగా ఉన్నట్టు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయాన్ని కూడా మహారాష్ట్రవాసులు ప్రస్తావిస్తున్నారు. మోదీ, అమిత్షా లాంటి నేతలకు దీటైన నాయకుడు కేసీఆర్ అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఉచిత విద్య, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కారణమయ్యాయని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ను తాము స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ పథకాలు తమ రాష్ట్రంలో అమలు కావాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. నేను ఆదిలాబాద్ జిల్లాలో చాలా గ్రామాలు తిరుగుతుంట. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. మునుగోడులో ప్రభుత్వ పథకాలే టీఆర్ఎస్ను గెలిపించాయి.
– సీతారాం శర్మ,ధిగ్రజ్, ఝరీ జామ్నీ తాలుకా, యావత్మాల్ జిల్లా
సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పోలీసు ఉద్యోగాలకు ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చారు. మహారాష్ట్ర సర్కార్ ఉద్యోగాలను భర్తీ చేస్తలేదు. ప్రైవేటులోనూ ఉద్యోగాలు లేవు.
– రాహుల్ మాధవస్తవార్,ధిగ్రజ్, ఝరీజామ్నీ తాలుకా, యవత్మాల్ జిల్లా