హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో శనివారం ఆర్టీసీ కండక్టర్పై ఓ మహిళ దాడికి దిగిన ఘటన చోటుచేసుకున్నది. నగరంలోని శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ప్రసన్న హైదర్గూడ వెళ్లేందుకు శివరాంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కింది. స్టేజీ దాటాక అత్తాపూర్లో ఆమెను దించారు. మెహదీపట్నం నుంచి ఉప్పల్ వెళ్తున్న 300 నంబర్ బస్సు ఎక్కింది.
సుమారు 200 మీటర్ల దూరంలోనే బస్సును దిగేందుకు ఆమె ప్రయత్నించగా, కండక్టర్ ముత్యాల నర్సింహ ఆమెను ఎక్కడ దిగాలంటూ అడిగారు. దీంతో ఆగ్రహానికి లోనైన సదరు మహిళ ఫ్రీగా బస్సులు ఎందుకు నడుపుతున్నారంటూ ఆయనను చెప్పుతో కొట్టింది. దీంతో తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకొని బస్సును రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ వరకు తీసుకెళ్లారు. స్టేషన్ సమీపంలో బస్సు ఆగగానే ఆమె అక్కడి నుంచి పరారైంది. కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.