స్టేషన్ ఘన్పూర్, జూన్ 2 : తన పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవాలంటూ ఓ మహిళ కన్నీరు కారుస్తూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాళ్లపై పడినా పట్టించుకోని ఘటన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సాక్షిగా జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లిలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండలంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ఆర్డీవో డీఎస్ వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. కొత్తపల్లికి చెందిన గుగ్గిళ్ల ఎల్లమ్మకు ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో పేరు రాగా, ముగ్గు పోసుకోవడానికి అంతా సిద్ధం చేసుకుంది.
ప్రొసీడింగ్స్ ఇచ్చే సమయానికి తమ పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారని, తమకు ఇల్లు ఇప్పించి ఆదుకోవాలంటూ కన్నీరు కారుస్తూ స్టేజీపై కడియం కాళ్లపై పడింది. మరొక వైపు ఇండ్లు, భూములు లేని నిరుపేదలకు ఇండ్లు కేటాయించాలంటూ సమావేశం మధ్యలో పుంజూ రి రజిత, నాగరాజు దంపతులు ప్లెక్సీ పట్టుకు ని నిరసన వ్యక్తం చేశారు. తమకు ఇల్లు కేటాయించకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని, నాయకుల చుట్టూ ఎన్నిమార్లు తిరిగినా ఇళ్ల జాబితాలో పేరు రాలేదని కడియంకు చేతులెత్తి మొక్కారు. దీంతో పోలీసులు బలవంతంగా అక్కడ నుంచి తీసుకపోయే ప్రయత్నంచేశారు. అధికారులు విచారణ చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేశారని, రెండో విడతలో మళ్లీ వస్తాయని కడియం నచ్చజెప్పారు.